Saturday, February 13, 2010

సీఎం రేసులో నేనూ ఉన్నా!: జానారెడ్డి

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభలో బిల్లు జేఏసీ చెబితే రాజీనామాలు చేయం రాకపోతనే నేనే రోడ్డెక్కుతా, సీఎం రేసులో నేనూ ఉన్నా!: జానారెడ్డి
నల్గొండ/మిర్యాలగూడ, ఫిబ్రవరి 12 : శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానే ఉంటుందని మాజీ మంత్రి కె.జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లాలో పలు శివాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన త్రిపురారం, దామరచర్ల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సొంత నియోజకవర్గం హాలియాలో జానా ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని పట్టుబట్టారు. 'రాజీనామాలు చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది. అలా అయితే తెలంగాణ మరో మూడేళ్లు వెనక్కి వెళుతుంది' అని జానారెడ్డి వారికి నచ్చజెప్పారు. 'తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద అపోహ లొద్దు. జేఏసీ చెబితే రాజీనామాలు చేయం. సమస్య పరిష్కారానికి అధిష్ఠానానికి కొంత వెసులుబాటు కల్పించాలి. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి మీతో కలిసి పోరాటం చేస్తా' అని ఆయన స్పష్టం చేశారు. మొట్టమొదటి సీఎం నేనే అనలేదు.. తొమ్మిది నెలల్లో తెలంగాణ వస్తుందని.. తానే ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించినట్లు వస్తున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. సీఎం కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఒకడినని చెప్పానే తప్ప.. తానే సీఎం అవుతానని అనలేదన్నారు. 9నెలల్లో తెలంగాణ వస్తుందని కూడా తానెక్కడా వ్యాఖ్యానించలేదన్నారు. 11 నెలల్లో నివేదిక ఇస్తుందని.. వచ్చే ఏడాది జనవరిలోనో.. ఫిబ్రవరిలోనో లోక్‌సభలో బిల్లు పెట్టే అవకాశముందని విశ్వాసం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment