Wednesday, September 8, 2010

రాష్ట్రాభివృద్ధి వ్యవసాయంపైనే ఆధారపటి ఉంది

సూక్షంగా పరిశీలిస్తే మన రాష్ట్రాభివృద్ధిలో సమతౌల్యం లోపించిందని తెలుస్తుంది. ప్రాంతీయ అసమానతలు కొన్ని రంగాలలో స్పష్టంగా కనబడతాయి. కోస్తా జిల్లాలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించగా పారిశ్రామిక రంగంలో అంత అభివృద్ధి కనపడదు. తెలంగాణా ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నా వ్యవసాయ రంగం వెనుకబడి వుంది. రాయలసీమ జిల్లాలు ఈ రెండు రంగాలలోనూ వెనుకబడి వున్నాయి.
రాష్ట్రాభివృద్ధిని, దేశాభివృద్ధితోనూ తక్కిన రాష్ట్రాల అభివృద్ధితోనూ పోల్చి చూచినపుడు మన అభివృద్ధి స్థాయి అవగతమవుతుంది. మన రాష్ట్ర ఆర్ధికాభివృధ్ధి 1960వ దశాబ్ధంలో 2.5 శాతం, 1970 దశాబ్ధంలో 3.12 శాతం, 1980 దశాబ్ధంలో 4.5 శాతం వుండగా ఈ దశాబ్ధాలలో భారతాభివృద్ధి వరుసగా 3.51, 3.33, 5.27 శాతంగా వున్నాయి. రాష్ట్రాభివృద్ధి శాతం దేశాభివృద్ధి శాతంకన్నా ఎప్పుడూ తక్కువగానే వుంటూ వచ్చింది. మన రాష్ట్రం 1980 దశాబ్ధంలో సాధించిన అభివృద్ధి శాతం ప్రాథమిక రంగాల్లో (ప్రైమరీ సెక్టార్‌) 3.4, ద్వితీయ రంగంలో (సెకెండరీ సెక్టార్‌) 4.3, తృతీయరంగంలో (టెరిటరీ సెక్టార్‌) 6.7 వుండగా దేశం మొత్తం మీద ఈ రంగాల్లో అభివృద్ధి శాతం వరసగా 3.9,6.9,6.2గా వున్నాయి. తృతీయ రంగం మినహా మిగిలిన రెండు రంగాలలో మన రాష్ట్రాభివృద్ధి శాతం దేశాభివృధ్ధి శాతం కన్నా తక్కువగా వుంది. ఈ దశాబ్ధంలో రాష్ట్రం తాలూకు మొత్తం అభివృద్ధి శాతం 4.5 వుండగా దేశాభివృధ్ధి శాతం 5.6. అంటే కీలక వుత్పాదక రంగాలైన వ్యవసాయం వస్తుత్పత్తి రంగాలలోనే గాక మన రాష్ట్రాభివృద్ధి శాతం దేశాభివృద్ధి శాతం కన్నా తక్కువగా వుండటం గమనించవచ్చు. అలాగే ఈ కాలంలో రాష్ట్ర తలసరి నికర దేశీయోత్పత్తి(నెట డొమెస్టిక ప్రొడక్ట) ప్రస్తుత ధరలలో (కరెంట ప్రైసెస్‌) దేశ తలసరి నికర దేశీయోత్పత్తి కన్నా 1974-75 సంవత్సరాలలో మినహా తక్కువగానే వుంది. పై రెండు సంవత్సరాలలో మాత్రం ఈ రెండూ ఇంచుమించు సమానంగా వున్నాయి.
వ్యవసాయ రంగాభివృద్ధి - సమస్యలు
మన రాష్ట్రాభివృద్ధి రేటు ఈ మధ్యన మందగించింది. సహజ వనరులలోనూ, నీటి వసతి కలిగిన వ్యవసాయ భూముల విస్తీర్ణములోనూ, ఎరువుల వాడకములోనూ, నూతన సేద్యపు సాంకేతిక పద్ధతులు ప్రవేశ పెట్టడంలోనూ మన రాష్ట్రం దేశ సరాసరికన్నా ముందుగానే వుంది. కానీ వ్యవసాయ ఉత్పత్తులలో దేశ సరాసరి ఉత్పత్తుల కంటే వెనుకబడి వుంది. సాగునీటి వనరులు, ఎరువుల వాడకంలో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలు విశేషమైన ప్రగతిని సాధించాయి. ఆ రాష్ట్రాలలో దారిద్య్ర రేఖకు దిగువ వున్న జనాభా శాతం తక్కువ. ఈ రాష్ట్రాలతో పోల్చి చూచినపుడు మన రాష్ట్రం వెనుకబడి వుంది. దీనికి కారణాలు, మన రాష్ట్రంలోని పంట భూముల్లో 35 శాతం భూములకు మాత్రమే సేద్యపు నీటి వసతి వుంది. ఈ శాతాలు పంజాబ్‌లో 88, హర్యానాలో 62. మన రాష్ట్రంలోని మిగిలిన భూములు అన్నీ వర్షాధారమైనవి. ఇక్కడి పంట సక్రమ సకాల వర్షాలపై ఆధారపడి వుంటుంది. సర్వసాధారణంగా ఈ ప్రాంతాలు అతివృష్టి, అనావృష్టి, తుఫానులకు గురి అవుతున్నాయి. వీటి వలన పంటలు బాగా దెబ్బ తింటింన్నాయి. ఒక ఏడాదిలో వీటివలన జరిగిన నష్టాన్ని పోడ్చుకోవడానికి రైతులకు 3 లేక 4 సంవత్సరాలు పడుతోంది. కోస్తా ప్రాంత భూములు సారవంతమైనవి. అయినా, పై కారణాల వల్ల నిలకడగా ప్రతి ఏడాది పంట లభించడం లేదు. డెల్టాప్రాంతాలలో మురుగు నీటి సమస్య ముఖ్యమైనది. ఈ ప్రాంతాలలో మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడం వల్ల ఖరీఫ పంట చాలా నష్టమౌతోది. డ్రైనేజి పధకాలపై ప్రభుత్వము చేసే ఖర్చు స్వల్పం. అది కూడా సక్రమంగా వినియోగ పడటం లేదంటున్నారు. సాగు నీటి సదుపాయం లేని జిల్లాలలో వుత్పత్తి, ఉపాధి అవకాశాలు తక్కువ. ఈ జిల్లాలలో దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న జనాభా శాతం కూడా ఎక్కువే. వ్యవసాయ కూలీల కుటుంబాలేకాక అనేక మంది చిన్న సన్నకారు రైతులు కూడా ఈ తరగతికి చెందినవారే. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్‌నగర, రాయలసీమాలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో ఈ పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ మెట్ట ప్రాంతాలే. వీటికి అనువైన విత్తనాలు, వీటిని ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా వ్యవసాయ పరిశోధన కేంద్రాలకే పరిమితమై వుండిపోయింది. రైతులకు అందుబాటులో లేవు. అందువలన ఈ భూముల ఉత్పాదకత, రైతుల ఆదాయాలు తక్కువే.
ప్రభుత్వం ఇలాంటి మధ్య తరహా, చిన్న తరహా నీటి పథకాలను చేపట్టి వెనకబడిన జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి చేయూతనివ్వాలి. ఈ పథకాలను త్వరగా పూర్తి చేయవచ్చు. వీటికయ్యే ఖర్చు కూడా తక్కువ. వీటి వలన అన్ని తరహా రైతులకు అన్ని ప్రాంతాలవారికి ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు చెరువుల అభివృద్ధికి కృషి చేయాలి. వీటిని మరమ్మత్తులు చేసి వీటి ప్రయోజనాలు రైతులందరికీ అందుబాటులో వుండేటట్లు చూడాలి. చాలా చెరువులలో ఇసుక, మన్ను పేరుకుపోయాయి. నిరుపయోగమైన మొక్కలు దుబ్బులు పెరిగి వీటి స్టోరేజి కెపాసిటీ కూడా తగ్గిపోయింది. అందువల్ల వీటి క్రింద పండించే పంట భూముల విస్తీర్ణం తగ్గింది. కొన్ని చెరువులను కొంత మంది అక్రమంగా ఆక్రమించి ప్రయోజనం పొందుతున్నారు. ప్రభుత్వం వీటిపై తగుశ్రద్ధ చూపించలేక పోతుంది. అంతేకాదు. భూగర్భ జలాల వినియోగాన్ని చెరువుల, కాలువల నీటి వినియోగంతో సంధానపరచి రైతులు అత్యధిక ప్రయోజనం పొందేట్టు చూడాల్సివుంది. 8వ పంచవర్ష ప్రణాళికలో ఇట్టి ప్రయత్నాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో వర్షాదారంతో పంటలు పండించే ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. వీటికయ్యే ఖర్చు భారీ నీటి పథకాల ఖర్చుతో పోల్చి చూస్తే అతిస్వల్పం.
ఉత్తరకోస్తాలోను కొన్ని జిల్లాలు, తెలంగాణాలోని కొన్ని జిల్లాలు,రాయలసీమ ప్రాంతాంలోని అన్ని జిల్లాలు చెరువులపై ఆధారపడే వ్యవసాయం చేసే వారు చాలా ఎక్కువ మంది రైతులున్నారు. చెరువుల మరమ్మత్తు చేయడంవలన వ్యవసాయ రంగం ఉత్పాదకత పెరగడమే కాక తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఉపాధి కల్పించే అవకాశాలు కూడా పెరుగుతాయి.
మన రాష్ట్రంలో వ్యవసాయ అభివృధ్ధికి కావలసిన అనుకూలమైన సహజ వనరులు వున్నాయి. సాగునీరు విద్యుశ్చక్తి అభివృద్ధి చేయడానికి వీలుంది. ఇప్పటివరకూ కల్పించిన నీటి పారుదల సౌకర్యాలను, విద్యుచ్చక్తినీ సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులన్ని సత్వరమే పూర్తి చేసి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే వ్యవసాయాభివృద్ధి పుంజుకుంటుంది. ఈ సందర్భంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌ మెంటు అండ్‌ ప్లానింగ్‌ స్టడీస్‌ (ఐ.డి.పి.యస్‌) విశాఖపట్టణం వారు తయారుచేసిన భగీరధీ ప్రాజెక్టు నమూనా గురించి ప్రస్తావించడానికి అప్రస్తుతం కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి చాలా పెట్టుబడి కావాలి. చాలా కాలం పడుతుంది కూడా. ఈలోగా ధరల పెరుగుదలవలన దీనికయ్యే ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఫలితాలు చాలా ఏళ్ల తరువాత కానీరావు. అందువల్లే ఐ.డి.పి.యస్‌. భగీరధి నీటి పథకాన్ని ప్రతిపాదించింది. దీనికి గోదావరి నీటిని విద్యుచ్చక్తితో ఏలేశ్వరం రిజర్వాయర్‌కు పంపి దాని నుండి స్టీల్‌ పాా్లంట్‌ అవసరాల కోసం త్రవ్విన ఏలేశ్వరం కాలువ ద్వారా పంపితే విశాఖ ప్రజలకు మంచినీరు పారిశ్రామిక అవసరాలను తీర్చగలగడమే కాక వ్యవసాయ రంగానికి కూడా సాగునీటి వసతి కల్పించవచ్చు. ఈ పథకాన్ని రెండేళ్లల్లో సుమారు రు.100 కోట్ల కంటే తక్కువ వ్యయంతో పూర్తి చేయవచ్చు. ఈ పథకం వల్ల చేకూరే లాభాలు దీనికయ్యే ఖర్చుతో పోల్చి చూస్తే చాలా తక్కువ. ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవలసి వుంది.
- పాతులోతు పాండు నాయక్

No comments:

Post a Comment